Samantha: డియర్‌ సామ్‌ మేడమ్‌.. ఎక్కడికి వెళ్లిపోయారు..?

సినీ ప్రియుల్లో అగ్రకథానాయిక సమంతకు (Samantha) విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలోనూ ఆమెను అనుసరించే వారి సంఖ్య.

Updated : 19 Aug 2022 10:55 IST

సోషల్‌మీడియాలో అభిమానుల పోస్టులు

హైదరాబాద్‌: సినీ ప్రియుల్లో అగ్రకథానాయిక సమంతకు (Samantha) విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలోనూ ఆమెను అనుసరించే వారి సంఖ్య మిలియన్లలోనే ఉంది. దీంతో సామ్‌ కూడా ఏ మాత్రం ఖాళీ దొరికినా.. నెట్టింట వాలిపోయేవారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వేదికగా తన కొత్త సినిమాలు, డైలీ రొటీన్‌, వాణిజ్య ప్రకటనలు, లేటెస్ట్‌ ఫొటోషూట్‌లు.. ఇలా ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తుండేవారు. అయితే, సామ్‌ చేసిన ఓ పని వల్ల అభిమానులు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. ‘డియర్‌ సామ్‌.. ఎక్కడికి వెళ్లిపోయారు’ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు అంతలా బాధపడేలా ఆమె ఏం చేశారంటే..?

దక్షిణాది, బాలీవుడ్‌, విదేశీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు సమంత. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా.. సోషల్‌మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి సామ్‌ సోషల్‌మీడియాకు దూరమయ్యారు. సుమారు నెల రోజుల నుంచి ఇన్‌స్టాలో ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. పలువురు సెలబ్రిటీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మధ్యలో కొన్నిసార్లు ఇన్‌స్టా స్టోరీస్‌లో బర్త్‌డే విషెస్‌ తెలిపారు తప్ప.. తన లైఫ్‌, కెరీర్‌పై ఎలాంటి అప్‌డేట్‌లు ఇవ్వలేదు. అలాగే ట్విటర్‌లోనూ ‘సీతారామం’ టీమ్‌ని మెచ్చుకుంటూ జులై 29న ట్వీట్‌ చేశారంతే. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ.. ‘‘డియర్‌ సామ్‌ మేడమ్‌.. ఎక్కడికి వెళ్లిపోయారు?’’, ‘‘సమంతకు ఏమైంది?’’, ‘‘సామ్‌.. ఎందుకని పోస్టులు పెట్టడం లేదు?’’ అని మాట్లాడుకుంటున్నారు.

నెగెటివ్ కామెంట్స్‌ కారణమా.. లేదా ట్రైనింగ్‌లో ఉన్నారా..?

‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ తర్వాత సామ్‌కు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ‘ఫ్యామిలీ మేన్‌’ డైరెక్టర్స్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం ఆమెను వరించింది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఓ సిరీస్‌లో వరుణ్‌ ధావన్‌ - సామ్‌ కీలకపాత్రలో నటించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. దీంతో, యాక్షన్‌ సీక్వెన్స్‌లకు సంబంధించి సామ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారని, అందుకే ఆమె ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎక్కడా కనిపించడం లేదని పలు ఆంగ్లపత్రికల్లో కథనాలు దర్శనమిస్తున్నాయి.

మరోవైపు, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తో కలిసి సామ్‌ ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్నారు. గత నెల 21న ఈ ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఇందులో సామ్‌ తన వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్స్‌ విపరీతంగా వైరలయ్యాయి. తనకు - నాగచైతన్యకు మధ్య సఖ్యత లేదని, ఒకవేళ తామిద్దరం ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తే అక్కడ ఎలాంటి పదునైన వస్తువులు లేకుండా చూడాలంటూ సామ్‌ చెప్పుకొచ్చారు. అలాగే, ఇదే వేదికగా ‘ఊ అంటావా’ పాటకు అక్షయ్‌తో ఆమె చేసిన డ్యాన్స్ కూడా వైరల్‌గా మారింది. ఈ ప్రోగ్రామ్‌ చూసిన పలువురు.. ఆమెను తప్పుబడుతూ సోషల్‌మీడియా వేదికగా నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. నెగెటివిటీ ఎక్కువవుతోన్న కారణంగానే ఆమె నెట్టింటికి దూరంగా ఉంటున్నారని మరి కొంతమంది చెప్పుకొంటున్నారు. ఏది ఏమైనా  అభిమానులు మాత్రం సామ్‌ని ఎంతగానో మిస్‌ అవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని