అందరూ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించా
క్రీడాకారులు ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యం దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని, లేదంటే అది పతనానికి దారితీస్తుందని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తాను కెరీర్ను నిర్మించుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు.
దిల్లీ: క్రీడాకారులు ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని, లేదంటే అది పతనానికి దారితీస్తుందని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తాను కెరీర్ను నిర్మించుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. ‘‘క్రీడ అథ్లెట్లోని ఉత్తమ ఆటను బయటకు తీసుకురాగలదు, నిరంతరం ఒత్తిడిలో ఆడటం వల్ల అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. ఇది తీవ్ర సమస్య. దృఢంగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు మానసిక ఒత్తిడి క్రీడాకారుడిని కుంగదీసే ప్రమాదముంది. నేనూ ఈ సమస్యతో బాధపడ్డాను. ఎలాంటి సమయంలోనైనా మద్దతుగా నిలుస్తూ, ప్రేమించే సభ్యులు చుట్టూ ఉన్నా.. కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించాను. చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురైవుండొచ్చు. దీని నుంచి బయటపడేందుకు ఒకటే మార్గం. నీకు నువ్వు సమయం కేటాయించి.. నీతో నువ్వు గడుపు. అలా చేయలేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూలేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఫిట్గా ఉండటం, శారీరక, మానసిక ఒత్తిడి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవడంపై దృష్టిసారించడం అథ్లెట్లకు కీలకం’’ అని కోహ్లి వివరించాడు. ‘‘తీరిక లేని షెడ్యూల్ నుంచి పునరుత్తేజం పొందడానికి నేను కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను. నా అభిరుచులను కొనసాగించడానికి సమయం కేటాయిస్తాను. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయాణం చేస్తుంటాను. అంతేకాదు.. కాఫీ లాగిస్తాను. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కాఫీ రుచులు ఆస్వాదిస్తాను’’ అని చెప్పాడు. తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ‘‘కెరీర్ ఆరంభంలో ఫిట్నెస్, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండేది కాదు. గత కొన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఫిట్నెస్ నా దినచర్యలో భాగమైంది. ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తాను. తీపి పదార్థాలను, పాల ఉత్పత్తులను వీలైనంతగా తగ్గించాను. నా పొట్ట సామర్థ్యంలో 90 శాతం మాత్రమే తింటాను. భోజన ప్రియుడినైనా నేను ఇలా కొలతల ప్రకారం తినడం కష్టమైన పనే. అయితే అలా ఉండటం వల్ల శరీరంలో కలిగే సానుకూల మార్పులు గమనిస్తే.. ఆరోగ్యంగా ఉండటం ఓ వ్యసనంగా మారుతుంది. అందుకే డైట్, ఫిట్నెస్ విషయంలో నేను అంత కఠినంగా ఉంటాను’’ అని కోహ్లి చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా